బొగ్గు బ్లాకులపై కార్మిక సంఘాల పోరు
● పీకే ఓసీపీ సింగరేణికే కేటాయించాలి ● ఉద్యమానికి సిద్ధమవుతున్న సంఘాలు
గోదావరిఖని(రామగుండం): బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కార్మిక సంఘాల పోరాటం ఉధృతమైంది. సింగరేణిలోని మణుగూరు ప్రకాశంఖని ఓసీ డిప్సైడ్ బ్లాక్ను టెండర్ ద్వారా కేటాయింపు బిడ్ ప్రకటించడంతో కార్మిక సంఘాలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ప్రస్తుతం గనిలోని బొగ్గు నిల్వలు మరో ఆరేళ్లు మాత్రమే ఉండటం, పీకేఓసీ డిప్సైడ్ సింగరేణికి రాకపోతే ఏరియా మొత్తం మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీతో పాటు జాతీయ కార్మిక సంఘాలైన బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ యూనియన్లు ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఈక్రమంలో ఈకోల్బ్లాక్కు రెండు సంస్థలు టెండర్లు వేశాయి. వీటిలో సింగరేణి సంస్థ, తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ సంస్థలున్నాయి. కాగా, పీకేఓసీపీలో బొగ్గుపైన ఉన్న ఓబీ వెలికితీసి సింగరేణి సంస్థకే అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, సింగరేణికే ఈఓసీపీని కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి బిడ్లో రెండు సంస్థలు టెండర్ వేయడంతో వేలంపాట ద్వారా కేటాయింపులను కేంద్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
వేరేసంస్థలు వస్తే ఒప్పుకోం..
పీకేఓసీపీ గనిలో వేరే సంస్థలు టెండర్ దక్కించుకుంటే ఒక్క బొగ్గు పెళ్ల కూడా తీసేందుకు ఒప్పుకోబోమని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మణుగూరు పీకేఓసీపీలో ఓబీ వెలికితీస్తే ఆ మట్టి పోసేందుకు స్థలం లేదని, అదే సింగరేణికి టెండర్ కేటాయిస్తే సొంత స్థలంలోనే ఓబీ మట్టి డంప్చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అయినా వేరే సంస్థలు వస్తే తాము ఊరుకోబోమని దీర్ఘకాలిక ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నాయి.
టెండర్ రాకుంటే మణుగూరుకు కష్టకాలమే..
పీకేఓసీపీ డిప్సైడ్ టెండర్ సింగరేణికి రాకుంటే మణుగూరు ఏరియాకు కష్టకాలమే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న బొగ్గు ఆరేళ్లవరకే ఉందని, టెండర్ దక్కకుంటే ఏరియాలో ఉత్పత్తి నిలిచి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గని డిప్సైడ్లో 60మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల మరో 20ఏళ్ల భవిష్యత్ ఉంటుందని పేర్కొంటున్నారు. బొగ్గు వెలికి తీసేందుకు 800మిలియన్ క్యూబిక్మీటర్ల ఓబీ(ఓవర్బర్డెన్)ని వెలికితీయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మణుగూరు ఏరియాకు కేంద్రం బిడ్ ప్రకటించిన పీకేఓసీ కీలకంగా మారనుంది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిడ్వేలం పాటలో కేటాయిస్తుందా? లేక వేలం ఎక్కువ పాట పాడి సింగరేణి దక్కించుకుంటుందా అని చర్చ కొనసాగుతోంది.
బొగ్గు నిల్వలు: 60మిలియన్ టన్నులు
భవిష్యత్: మరో 20ఏళ్లు
ఓబీ వెలికితీత: 800మిలియన్ క్యూబిక్మీటర్లు
కార్మికులు: 800 మంది (సుమారు)


