● రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● నలుగురికి తీవ్రగాయాలు
మాచారెడ్డి: దైవ దర్శనానికి ఆటోలో వెళ్లి వస్తున్న ఓ కుటుంబాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పాల్వంచ మండల సమీపంలోని కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీకి చెందిన కీర్తి రాజు, ఆయన భార్య చిత్ర(30), కుమారుడు జై సాత్విక్, కుమార్తె హర్షిని, వారి సమీప బంధువు శంకరమ్మతో కలిసి ఆటోలో మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం అదే ఆటోలో కామారెడ్డికి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరిని వేగంగా ఢీకొన్నది. ప్రమాదంలో చిత్ర అక్కడికక్కడే మృతిచెందగా రాజుతో పాటు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్లో క్షతగాత్రులను ్కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు.


