మద్నూర్: మండల కేంద్రం నుంచి రైల్వే లైన్ ఏర్పాటుపై రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ అఖిల్ విచారణ చేపట్టారు. మద్నూర్లో రైల్వేలైన్ ఏర్పాటుపై మండలకేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త బండివార్ హన్మండ్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్కు ఈ మెయిల్ చేశాడు. దీంతో బుధవారం రైల్వేశాఖ అధికారి అఖిల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సందీప్, సామాజిక కార్యకర్త హన్మండ్లుతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి పక్కన ఉన్న దేగ్లూర్ మీదుగా కర్ణాటకలోని బీదర్ వరకు రైల్వే లైన్ వెళ్లనుంది. దేగ్లూర్ నుంచి తెలంగాణలోని మద్నూర్ మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని వారు రైల్వే అధికారితో విన్నవించారు.


