కామారెడ్డి టౌన్ : ప్రతి పౌరుడికి న్యాయం పొందే సమాన హక్కు ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిద పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ‘ఉచిత న్యాయ సహాయం – న్యాయాన్ని పొందే హక్కు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయవాది సేవలు, సలహాలు, కోర్టు సంబంధిత సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ఫ్రీ నంబర్ 15100 ను వినియోగించుకోవాలన్నారు. విద్య, క్రీడలు, ఇతర పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ చంద్రసేనరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమీఉల్లా ఖాన్, జుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రణీత, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ సురేష్ పాల్గొన్నారు.
‘మత్తు పదార్థాల నిర్మూలనకు
కృషి చేయాలి’
కామారెడ్డి అర్బన్ : మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్’ కరపత్రాల ఆవిష్కరణతోపాటు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, కౌన్సిలర్లు, బ్రహ్మకుమారీలు మీనాక్షి, గంగ, సమత, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
దోమకొండ : క్రీడల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటాలని జాతీయ అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు కామినేని అనిల్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం గడికోటలో మండలానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు తిర్మల్గౌడ్, అంజలి, సదానంద, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు సిద్దరాములు తదితరులు పాల్గొన్నారు.


