● చోరీకి పాల్పడి కటకటాల పాలు
● కేసు వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి క్రైం : ఓ వ్యక్తి అగ్ని ప్రమాదంలో ఆస్తులు కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కేందు కు అడ్డదారిని ఎంచుకుని చోరీకి పాల్పడి కటకటాల పాలయ్యాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
జిల్లాకేంద్రంలోని దేవునిపల్లి విద్యుత్నగర్ కాలనీకి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి సురేశ్ కుటుంబం ఈనెల 7 న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 16 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, రూ.90 వేలు నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి దేవునిపల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్ను నిందితుడిగా గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నేరం ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. గతంలో నిందితుడు శ్రీనివాస్కు చెందిన ఇల్లు, దుకాణం అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. అప్పులతో ఆర్థిక ఇబ్బందుల పాలయ్యాడు. దీంతో తేలికగా డబ్బులు సంపాదించాలని భావించి దొంగతనానికి ఒడిగట్టాడు. నిందితుడి వద్దనుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు చేదనలో విశేషంగా కృషి చేసిన డీఎస్పీ మధుసూదన్, రూరల్ సీఐ శ్రీధర్గౌడ్, సీసీఎస్ సీఐ రామన్, ఎస్సైలు రంజిత్, మహేష్, సిబ్బంది రాజేందర్, రవి, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, కిరణ్లను అభినందించారు.


