కొంగొత్త ఆలోచనలతో...
స్వతంత్ర భారతంలో యువతరం అన్ని రంగాలలోనూ సత్తా చాటుతోంది. రాజకీయాల్లోనూ పలువురు రాణిస్తున్నారు. జిల్లాలో సగానికిపైగా గ్రామాల్లో పాలన యువత చేతుల్లోనే ఉంది. యువ సర్పంచ్లు, వార్డు సభ్యులు తమదైన ఆలోచనలతో గ్రామాల్లో సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నారు. నిత్యం ప్రజల మధ్యకు వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యలతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపు సగం గ్రామాల్లో సర్పంచ్లు 40 ఏళ్లలోపు వారే ఉండడం గమనార్హం. కొందరు సర్పంచ్లు పొద్దున లేవగానే ఊరంతా కలియ తిరుగుతున్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
‘సర్’లో చురుకుగా..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో చాలా గ్రామాల్లో సర్పంచ్లు కీలకపాత్ర పోషించారు. బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలు ఇంటింటికి చేర్చడమే కాదు, వాటిని పూరించి తిరిగి అప్పగించేలా చూశారు. దీంతో చాలా గ్రామాల్లో వంద శాతం పూర్తయ్యింది. అలాగే ప్రభుత్వ పథకాలు తమ గ్రామాలకు ఎక్కువ మందికి అందేలా చొరవ తీసుకుంటున్నారు. కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారితో దరఖాస్తులు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం
టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న యువ సర్పంచ్లు.. గ్రామ పాలనలోనూ డిజిటల్ విధానాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాల గురించి, సమావేశాలు, సభల గురించి వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వాట్సాప్ ద్వారా గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారు. వాట్సాప్ గ్రూపులలో పంచాయతీ కార్యదర్శి, జీపీవో, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, వ్యవసాయ విస్తీర్ణాధికారి, అటవీ అధికారి, గ్రామ పోలీసు అధికారుల నంబర్లు చేర్చి ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన అంశాలు ప్రజలకు తెలిసేలా చూస్తున్నారు.
చాలా గ్రామాల్లో పంచాయతీల్లో ముఖ్యంగా యువత ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు నడుస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో కొత్త విధానాలు, ప్లాస్టిక్ నియంత్రణ, మొక్కల పెంపకం, సీసీ కెమెరాల ఏర్పాటు, వీధిలైట్ల నిర్వహణ, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన వంటి వాటి విషయంలో చురుకుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సాయంతో అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విషయమై ప్రత్యేక శ్రద్ధ చూపారు. పలువురు స్వయంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. అలాంటి పల్లె పాలనలో ఒకప్పుడు పెద్దలదే కీలక భూమిక. కానీ పరిస్థితి క్రమంగా మారుతోంది. ప్రస్తుతం యువతరం సైతం సత్తా చాటుతోంది. జిల్లాలో చాలా పంచాయతీల్లో సర్పంచ్లుగా యువతే ఎన్నికయ్యారు. సరికొత్త ఆలోచనలతో పలువురు తమ గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు స్థానికంగా దాతల సాయంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో తమదైన ముద్ర వేసుకునే ప్ర యత్నం చేస్తున్నారు పలువురు యువ సర్పంచ్లు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. చాలా గ్రామాల్లో మురికి కాలువలు అధ్వానంగా తయారైన పరిస్థితుల్లో.. వాటిని శుభ్రం చేయించడంతో పాటు కొత్తగా మురికి కాలువల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. ఉపాధి హామీ, ఇతర పథకాల ద్వారా సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. తాగునీటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు.
పల్లె పాలనలో కీలకంగా యువత
సగానికిపైగా పంచాయతీలు
వారి చేతిలోనే..
సరికొత్త ఆలోచనలతో అభివృద్ధికి
బాటలు వేస్తున్న పలువురు
స్వతంత్ర భారతంలో మారుతున్న
గ్రామాల ముఖచిత్రం


