తాడ్వాయి మండలం దేవాయిపల్లి సర్పంచ్ ముత్యాల నరేశ్ పల్లె పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టేకన్నా ముందే గ్రామంలో తాగునీటి పరిష్కారం కోసం శుద్ధ జలాలు అందించే ప్లాంటును ఏర్పాటు చేయించారు. గ్రామంలో ప్లాస్టిక్ వద్దనే నినాదాన్ని ముందుకు తీసుకువచ్చి.. ఫంక్షన్లలో స్టీల్ ప్లేట్లు వాడాలంటూ చైతన్యం చేస్తున్నారు. గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్ లైను మూడు గ్రామాలకు కలిపి ఉంది. దీంతో అనేక సమస్యలు తలెత్తేవి. దీంతో గ్రామానికి ప్రత్యేక 11 కేవీ లైన్ కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. వేసవి కాలంలో గ్రామంలో రాగిజావ పంపిణీ చేపట్టారు. తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


