తెయూలో రెడ్ క్రాస్ సొసైటీ క్లబ్ ప్రారంభం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ క్లబ్ను ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ నోడల్ అధికారి లావణ్య మాట్లాడుతూ.. యువత బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కే అపర్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు అతీక్, హలీమ్ఖాన్, శ్రీనివాస్, భ్రమరాంబిక, ఎన్ స్వామి, పీఆర్వో కేవీ రమణాచారి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పీజీ బ్యాక్లాగ్ పరీక్షల్లో ఒకరి డిబార్
తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ 1, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో మంగళవారం మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 490 మందికి 405 మంది హాజరు కాగా 85 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రంలో ఒకరు డిబార్ అయినట్లు తెలిపారు.
క్యాంపస్లో 17 నుంచి 25 వరకు తీజ్
తెయూలో ప్రతి ఏటా నిర్వహించే తీజ్ ఉత్సవాలను ఈ సారి కూడా జరుపుకొంటామని నిర్వాహకులు తెలిపారు. బంజారాల పవిత్రమైన పండుగగా భా వించే తీజ్ ఈ నెల 17 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వర్సిటీ బంజారా బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు
తెయూ ఇంజినీరింగ్ కళాశాలలోని బీటెక్ సీఎస్ఈ, ఏఐ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు 70 మందికి అందరు విద్యార్థులు హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్
తెయూ ఏబీవీపీ కమిటీ ఆధ్వర్యంలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. లాసెట్ 2026 ద్వారా తెలంగాణ యూనివర్సిటీ లా కాలేజ్లో ప్రవేశాలు పొందడాని కి వచ్చిన విద్యార్థులకు హెల్ప్డెస్క్ ద్వారా అవసర మైన సాయం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీ పీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివకుమార్రెడ్డి, రాష్ట్ర వనవాసి కన్వీనర్ అశోక్, వర్సిటీ ఉపాధ్యక్షులు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు దోస్త్ ధ్రువపత్రాల పరిశీలన
తెయూ పరిధిలోని దోస్త్ 2026 ద్వారా 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం నిర్వహించనున్నట్లు తెయూ దోస్త్ కోఆర్డినేటర్ వాసం చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు తెయూ అడ్మిషన్స్ డైరెక్టరేట్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. పీహెచ్, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులమ్ ఆక్టివిటీస్ కేటగిరి విద్యార్థులు ఈ వెరిఫికేషన్కు హాజరు కావాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ వెంట ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన తెలిపారు.


