● పింఛన్ల దరఖాస్తుల పరిశీలన,
నమోదు వేగవంతం చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. చేయూత పెన్షన్ దరఖాస్తులను గ్రామస్థాయిలో స్వీకరించి పరిశీలించాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అలాగే జలసిరి కార్యక్రమం కింద ఇంకుడు గుంతలు, చెరువులు, కుంటల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామసభల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పనులను ఎంపిక చేసి, లక్ష్యాలను సాధించేలా పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, డీఆర్డీవో దామోదర్రెడ్డి, డీపీవో మురళి, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, ఎంపీడీవోలు, ఎంఈవోలు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


