సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆధునిక కాలంలోనూ క్షుద్రపూజలను నమ్మడం మంచిది కాదని, మూఢ నమ్మకాలను వీడాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత హరీశ్రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని క్షుద్రపూజల తరహా పూజలు నిర్వహించే ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఆయన ఎలాంటి పూజలు చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్నినోలాంటి పరిస్థితుల్లో ఆ పూజల మర్మమేంటో ప్రజలకే చెప్పాలన్నందుకు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడులలో ఎక్కడ పాదయాత్రలు చేసినా ఒరిగేదేం లేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్సే తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈసారి 80 శాతానికిపైగా సీట్లు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. బిహార్లోని బంకీపూర్ ఉప ఎన్నికలో ఓటమితో మోదీకి నూకలు చెల్లినట్టేన్నారు. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ రాజీనామా చేసిన సీటులో ఓడిపోవడంతోనే ఆ పార్టీ పని అయిపోయిందన్నారు. జిల్లాకు ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలలను తీసుకొచ్చామని, జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ధాన్య సేకరణ విషయంలో కఠినంగా వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నాయకులు బాడ్సి శేఖర్గౌడ్, గడుగు గంగాధర్, మానాల మోహన్రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, భక్తవత్సలం, నరేందర్రెడ్డి, జావిద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
క్షుద్రపూజలు, మూఢనమ్మకాలు
మంచివి కాదని చెబుతున్నా
ఈ విషయంలో అంత
ఉలిక్కిపాటు ఎందుకు?
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్


