లింగంపేట: లింగంపేట మండలం పర్మళ్ల జీపీ పరిధిలోని అటవీ భూమిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్లో నాటిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల ఉపాధి హామీ పథకం నిధులతో ఎనిమిది ఎకరాల్లో సుమారు వెయ్యి మొక్కలు నాటారు. ఇందు కోసం వారం రోజులు శ్రమించి గుంతలు తవ్వించారు. మండల ప్రత్యేకాధికారి, జడ్పీ డిప్యూటీ సీఈవో సురేందర్, సర్పంచ్ బాబాయి నరేశ్, క్షేత్రసహయకుడు లక్ష్మణ్, కార్యదర్శి నరేశ్, గ్రామస్తులు కలిసి ఈ నెల 14వ తేదీన మొక్కలు నాటారు. నాటిన మూడు రోజులకే సుమారు 350 మొక్కలను కొందరు ట్రాక్టర్తో రాత్రివేళ ధ్వంసం చేశారు. కొందరు వ్యక్తులు అటవీ భూమిని ఆక్రమించుకోడానికే ఈ చర్యలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రుద్రూర్: పొతంగల్ మండలం సుంకిని శివారులో కుక్కల దాడిలో ఓ కృష్ణజింక మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. సుంకిని శివారులో సంచరిస్తున్న కృష్ణజింకపై కుక్కలు దాడి చేశాయి. దీనిని గమనించిన ఓ రైతు కుక్కలను తరిమికొట్టి జింకను గ్రా మంలోకి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే జింకకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ గ్రామానికి చేరుకుని జింకను పరిశీలించారు. తీవ్రగాయాల కారణంగా కృష్ణజింక మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది జింక కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. అటవీ ప్రాంతాల్లో సంచరించే వన్యప్రాణులపై కుక్కల దాడులు పెరుగుతున్నాయని, వాటి సంరక్షణకు తగిన చర్య లు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరారు.
అడవిపందుల దాడిలో
చెరుకుపంట ధ్వంసం
తాడ్వాయి: మండలంలోని కృష్ణాజివాడి శివారులో ఉన్న చెరుకు పంటను అడవి పందులు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన శేర్బద్దం చంద్రారెడ్డి తన మూడెకరాల వ్యసాయ భూమిలో చెరుకు పంటను వేశాడన్నారు. పందులు గుంపులు, గుంపులుగా ఒకేసారి వచ్చి పంటలోకి ప్రవేశించి చేతికొచ్చిన చెరకుగడలను ధ్వంసం చేశాయి. దీంతో తీవ్రంగా నష్టం జరిగిందని, ప్రభుత్వం తనకు నష్టపరిహారం అందించాలని రైతు చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరాడు.
బోధన్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి మండలం ఎమ్మెస్సీఫారం గ్రామంలో శనివారం రాత్రి రాకం స్వప్న(44) అనే వివాహిత కొంత కాలంగా గుండెనొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


