● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
కామారెడ్డి క్రైం: ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికల రూపకల్పనకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో అవసరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఏవో మోహన్రెడ్డి, డీఎంహెచ్వో వెంకట్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


