● 2 కాసుల బంగారం
● రూ.2 లక్షల నగదు చోరీ
ప్రత్తిపాడు: దుండగులు చేపల చెరువు యజమాని గొంతు కోసి హత్య చేసి, బంగారు వస్తువులు, నగదు దోచుకుపోయిన ఘటన శనివారం మండలంలోని టి.రాయవరంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన తటవర్తి మెహర్ ప్రసాద్కు చెందిన చెరువును ఏలూరు జిల్లా పైడి చింతపర్రు గ్రామానికి చెందిన మోరి నరసింహారావు (70) లీజుకు తీసుకుని నాలుగేళ్లుగా చేపలు పెంచుతున్నాడు. చెరువు వద్ద మకాంలో కొవ్వాడలంక గ్రామానికి చెందిన వితంతువైన తన కూమార్తె బలే నాగలక్ష్మితో కలిసి అతను జీవిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం పెన్షన్ నిమిత్తం తన కుమార్తె కొవ్వాడలంక వెళ్ళింది. శుక్రవారం సాయంత్రం చేపల చెరువు మకానికి సమీపంలో ఉన్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన స్నేహితులు గొర్ల రాంబాబు, చిరికే అప్పారావుతో కలిసి టీ తాగారు. ఆ రాత్రి వేళ ఇద్దరు లేదా ముగ్గురు అగంతకులు వచ్చారని, వారితో జరిగిన ఘర్షణలో పదునైన ఆయుధంతో నరసింహారావు మెడ కోసి, హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నాగలక్ష్మి గదిలోని బీరువా పగలగొట్టి 10 గ్రాముల బంగారు వస్తువులు, రూ.2 లక్షల నగదు దోచుకుపోయారు. స్నేహితులు రాంబాబు, అప్పారావు ఉదయం వచ్చి పిలిచినా పలకకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా అతడు విగతజీవుడై పడి ఉన్నాడు. వారి సమాచారం మేరకు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతంతో కలిసి సీఐ బి.సూర్య అప్పారావు, డీఎస్పీ ఏబీజీ తిలక్ హత్యా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని శవపరీక్షకై ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


