ప్రత్తిపాడు రూరల్: పెద్దపులి సంచారంతో ప్రత్తిపాడు, శంఖవరం మండలాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత, శుక్రవారం తెల్లవారుజామున రాజవొమ్మంగి రేంజి పరిధిలోకి వెళ్లినట్లు రేడియో కాలర్ ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే పులి పూర్తిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిందనే నిర్ధారణ లేకపోవడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
ఆవులపై దాడి.. ఒకటి మృతి
శుక్రవారం సాయంత్రం అవేల్తి గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి రెండు ఆవులపై దాడి చేసినట్లు అటవీశాఖకు సమాచారం అందింది. ఈ ఘటనలో ఒక ఆవు మృతి చెందగా.. మరో ఆవు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడికి వెళ్లిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రేడియో కాలర్ ద్వారా జిల్లా అటవీ అధికారి ఎ.రామచంద్రరావు సిబ్బందికి సూచనలిస్తున్నారు. కాగా అత్యవసరమైతే తప్ప ఎవరూ ఒంటరిగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దారపల్లి వాటర్ఫాల్స్కు వెళ్లొద్దు
పులి సంచారం నేపథ్యంలో దారపల్లి వాటర్ఫాల్స్ ప్రాంతానికి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎవరూ వెళ్లవద్దని పర్యాటకులు, స్థానికులకు అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.
గతంలోనూ పలుమార్లు..
నియోజకవర్గానికి పెద్దపులి సంచారం కొత్తేమీ కాదు. 2022లో ప్రత్తిపాడు మండలంలో సుమారు 37 రోజులపాటు పులి సంచరించింది. పోతులూరు కొండలు, పాండవులపాలెం–పొదురుపాక ప్రాంతాల్లో పులి కదలికలు, పశువులపై దాడులు నమోదయ్యాయి. 2024 డిసెంబరులోనూ ప్రత్తిపాడు మండలంలోని బాపన్నధార పరిసరాల్లో లేగ దూడపై దాడి చేసింది. 2026 మార్చిలోనూ పులి సంచారం కలకలం రేపింది.
ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లో మూడు రోజులుగా సంచారం
రేడియో కాలర్ ద్వారా రాజవొమ్మంగి రేంజి వైపు వెళ్లినట్లు గుర్తింపు
అప్రమత్తమైన అటవీశాఖ
అడవుల్లోకి వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరిక


