అన్నవరం: సత్యదేవునికి కొత్త వెండి రథం సమకూరనుంది. ప్రస్తుతం స్వామివారి ఊరేగింపులో ఉపయోగిస్తున్న వెండి రథాన్ని 50 సంవత్సరాల క్రితం తయారు చేయించారు. ఇది శిథిలావస్థకు చేరడంతో రథసేవ నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. దీనిపై ‘ఏ తేరుగ ఊరేగెదవో స్వామీ..’ శీర్షికన సాక్షి శుక్రవారం ప్రచురించిన కథనానికి అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. ఊరేగింపు అనంతరం శుక్రవారం ఆ రథాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దాతలు లేదా దేవస్థానం నిధులతో సత్యదేవునికి కొత్త రథం తయారు చేయిస్తామని తెలిపారు. వచ్చే నెలలో జరిగే ట్రస్ట్బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


