బుట్టాయగూడెం: గత 10 రోజులుగా ఏలూరు జిల్లాలో రెండోసారి సంచరించిన పెద్దపులి పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సంచరిస్తూ పశువులను హతమారుస్తూ అటవీశాఖ అధికారులకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కాగా పెద్దపులి శుక్రవారం సాయంత్రానికి తెలంగాణ రాష్ట్రం ఆశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల, గోపన్నగూడెం వైపు వెళ్లినట్లు గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే తెల్లవారుజామున కామవరంలోని మడివి కృష్ణకు చెందిన ఒక ఆవు, గిత్తలపై దాడి చేసి హతమార్చింది. మళ్లీ వస్తుందనే అనుమానంతో రాత్రి 9 గంటల వరకూ సరిహద్దుల్లోనే జిలా అటవీశాఖ అధికారి సందీప్రెడ్డి పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పులి ఏపీ సరిహద్దు దాటుతూ తెలంగాణలోకి వెళ్లడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్ నెలలో కావిడిగుండ్ల నుంచే ఏపీలోకి ప్రవేశించి బుట్టాయగూడెం మండలంలో పలు పశువులపై దాడి చేసి చంపిన పెద్దపులి మొదటిసారిగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కింది. మళ్లీ శుక్రవారం అధికారుల డ్రోన్ కెమెరాకు చిక్కింది. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిన పులి మళ్లీ పోలవరంలో ప్రత్యక్షమై గోదావరి ఈదుతూ పోలవరం జిల్లాలోకి వెళ్లి మళ్లీ ఏలూరు జిల్లాలోని పోలవరం మీదుగా పలు మండలాల్లో సంచరిస్తూ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది.


