తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైన తలుపులమ్మ తల్లికి ఆషాఢమాసం సందర్భంగా అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, గాజులతో సారె సమర్పించారు. శుక్రవారం అన్నవరం దేవస్థానం ఈఓ నల్లల సూర్యచక్రధరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యుల కుటుంబాలు సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, ఫల పుష్పాలు, పిండివంటల సారెతో లోవకు చేరుకుని తలుపులమ్మకు సమర్పించారు. అమ్మవారిని దర్శించిన ఈఓ, ట్రస్ట్ బోర్డు కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా అన్నవరం, లోవ దేవస్థానం ఈఓలు సూర్యచక్రధరరావు, విశ్వనాథరాజు మాట్లాడుతూ ఆనవాయితీగా వచ్చే సంప్రదాయాలను కొనసాగిస్తూ దేవాలయాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధం పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ధర్మకర్తలు పాల్గొన్నారు.
● లోవ తలుపులమ్మ అమ్మవారికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చీర సారెను సమర్పించారు. దేవస్థానానికి వచ్చిన అనితకు ఈఓ పి.విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.


