కాకినాడ క్రైం: హిజ్రాల దాడిలో గే మృతి చెందిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాగంపేటకు చెందిన రాజు శివ (45) ఒక గే. ఇతను కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పలువురు హిజ్రాలతో కలిసి భిక్షాటన చేసేవాడు. ఈ క్రమంలో జ్యోతుల కాలనీలో నివాసం ఉంటున్న కిరణ్మయి, అజయ్ అనే హిజ్రాలతో సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. ఇరువురు బీరు సీసాతో శివ తలపై కొట్టి ఎడమ దవడ చీల్చేశారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై శివ అచేతన స్థితిలో కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన దూరపు బంధువులు జీజీహెచ్లో చేర్చారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. హత్య చేసిన కిరణ్మయి, అజయ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. హత్య అనంతరం వీరిద్దరు, హత్యోదంతం నమోదైన స్థానిక ఇళ్లలో సీసీ టీవీ ఫుటేజీలను బలవంతంగా డిలీట్ చేయించి, ఎవరైనా తమకి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే, తీవ్ర పర్యావసనాలు ఉంటాయని స్థానికులను బెదించారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్య ఘటనపై కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.


