పిఠాపురం: స్థానిక బ్రాంచ్ కెనాల్ కింద కాలువల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం జలవనరుల శాఖ అధికారులతో కలిసి పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లోఆయన పర్యటించారు. గొల్లప్రోలు కొత్త కలింగలు, బల్లకట్టు, నల్లకొండ, గాలికొండ ప్రాంతాల్లో కాలువల, రాజా రావు బహద్దూర్ చెరువు అభివృద్ధి పనులను, చెరువు మిగులు జలాల నిర్వహణను పరిశీలించారు. కాండ్రకోట– పిఠాపురం కాలువ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. సూరంపేట వాసులు దారి సమస్యపై వినతిపత్రం ఇచ్చారు. మల్లవరం బ్రిడ్జి నుంచి కాలువను పరిశీలించారు. అక్కడకు రైతులు వచ్చి ఇంజిన్లతో నీరు తోడుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు.ధవళేశ్వరం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.శ్రీనివాస్, గోదావరి డెల్టా చైర్మన్ ఎం.సునీల్కుమార్, జల వనరుల శాఖ ఈఈ శేషగిరిరావు, అడిషనల్ కలెక్టర్ ప్రియాంక, ఏడీఏ పి.స్వాతి పాల్గొన్నారు.
బోట్క్లబ్ (కాకినాడసిటీ): జిల్లాలో రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏర్పాటైన కమిటీల ద్వారా ‘రైతన్న మీ కోసం‘ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా ఈ నెల ఏడో తేదీ నుంచి నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని వ్యవసాయ, అనుబంధ రంగాల క్షేత్ర స్థాయి సిబ్బందితో వీడియో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన వివిధ ఆసుపత్రుల్లో జరుగుతున్న సివిల్ పనులు, నూతన భవనాల నిర్మాణాలు, ప్రహరీలు, డ్రైనేజీ వ్యవస్థ, సెప్టిక్ ట్యాంకులు, మార్చురీల నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు.


