అన్నవరం: తొలి ఏకాదశి పర్వదినం, శనివారం కలిసి రావడంతో అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది వివాహాలు చేసుకున్న దంపతులు, వారి బంధుమిత్రులు కూడా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో తీవ్ర రద్దీ నెలకొంది. సుమారు 40 వేల మంది భక్తులు విచ్చేశారు.
దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం
సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీతో మధ్యాహ్నం వరకు అంతరాలయ దర్శనం నిలిపివేశారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మందికి అన్నదానంలో భోజనం సౌకర్యం కల్పించారు. కాగా.. ఆదివారం ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించనున్నారు.
తొలి ఏకాదశి పూజలు
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లకు 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ జరిపారు. తొమ్మిది నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందచేసి ప్రసాదాలు నివేదించారు.
● తొలి ఏకాదశికి
భారీగా తరలివచ్చిన భక్తులు
● స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది


