ఎర్రవల్లి: రైతులు క్రమం తప్పకుండా పంటలను పరిశీలిస్తూ.. సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. శుక్రవారం మండలంలోని కోదండాపురం, వేముల గ్రామాల్లో పంట పొలాలను టీఆర్వీకే సమన్వయకర్త డా.అర్చన, ఆర్ఏఆర్ఎస్ పాలెం శాస్త్రవేత్తలు శ్రీరామ్, మమత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తిలో రసం పీల్చే పురుగు ఉధృతి.. తేమ ఒత్తిడి, మిరపలో త్రిప్స్ కారణంగా ఆకులు పైకి ముడుచుకోవడం.. కందిలో స్టెరిలిటీ మొసాయిక్ తెగులు, హెలికోవర్పా పురుగు ఉధృతిని గమనించారు. రసం పీల్చే పురుగుల నివారణకు చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఎసిటమాప్రైడ్ 20శాతం ఎస్పీ ఎకరాకు 100 గ్రాములు లేదా థయోమెథాక్సమ్ 25శాతం డబ్ల్యూజీ ఎకరాకు 100 గ్రాములు వినియోగించాలని సూచించారు. అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడరాదని సూచించారు. మిరపలో త్రిప్స్, దోమ, నల్లి నివారణకు నీలి, పసుపు, తెలుపు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైనప్పుడు స్పినెటోరమ్ 11.7శాతం ఎస్ఈ ఎకరాకు 160 ఎం.ఎల్. లేదా స్సినోసాడ్ 45శాతం ఎస్ఈ ఎకరాకు 75 ఎం.ఎల్. పిచికారీ చేయాలని సూచించారు. వైరస్ లక్షణాలతో తీవ్రంగా ప్రభావితమైన మొక్కలను తొలగించి నాశనం చేయాలన్నారు. కందిలో స్టెరిలిటి మొసాయిక్ తెగులును వ్యాప్తిచేసే ఎరియోఫైడ్ మైట్ను నియంత్రించేందకు సిఫార్సు చేసిన అకారిసైడ్ను వినియోగించాలని తెలిపారు. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 5శాతం ఎస్జీ ఎకరాకు 100 గ్రాములు, క్లోరాంట్రనిలిప్రోల్ 18.5 శాతం ఎస్ఈ ఎకరాకు 60 ఎం.ఎల్. సిఫార్సు మేరకు ఉపయోగించాలని సూచించారు. వారి వెంట ఏఓ సురేశ్గౌడ్, ఏఈఓలు ఉన్నారు.


