● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జరిగే జాతీయ పతాకాన్ని ఎగురవేసే వారి పేర్లను గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేటలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి వాకిటి శ్రీహరి, నాగర్కర్నూల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జోగుళాంబ గద్వాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.
బీచుపల్లిలో
శ్రీరామనామ భజనలు
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పంచమ వార్షికోత్సవం సందర్భంగా గురువారం శ్రీరామ జయరామ జయ జయ రామ ఏకాక నామ భజనలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిలాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భజన బృందాలు శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ రామనామ భజనలు చేశారు. శ్రీరామనామం జపించడం కానీ.. శ్రీరామ కోటిని రాయడం కానీ ఆచరిస్తే తమ కష్టాలు తొలగిపోయి ఎన్నో శుభాలు కలుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో 24 గంటలపాటు ఏకదాటిగా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, భజన బృందాలు, భక్తులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ఆధ్వర్యంలో ఇజ్రాయిల్లో గృహ ఆధారిత సంరక్షకుడు, సంరక్షకురాలు ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి ప్రశాంతి గురువారం ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్లో కేర్గివింగ్ ఉద్యోగాలకు మహిళలు 90 శాతం, పురుషులు 10 శాతం చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తామని, అభ్యర్థుల వయసు 25–45 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఏఎన్ఎం, జీఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ డిప్లొమా ఇన్ పేషెంట్ కేర్ లేదా బీఎస్సీ నర్సింగ్, అలాగే ఇంటర్మీడియట్లో ఆంగ్ల భాషా నైపుణ్యం ఉండడంతోపాటు, గుర్తింపు పొందిన భారతీయ అధికార సంస్థ నుంచి నర్సింగ్లో గుర్తింపు పొందిన లేదా పర్యవేక్షణలో ఉన్న డిప్లొమా శిక్షణ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు సుమారు 5,880.02 ఎన్ఐఎస్ మన కరెన్సీలో రూ.1,86,000 వరకు జీతం లభిస్తుందన్నారు.


