గద్వాల: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌళిక వసతులు కల్పిస్తూ.. రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న లోటుపాట్లను సమగ్రంగా గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న సదరం భవనాన్ని ఈ నెల 15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన సామాజిక భద్రత పెన్షన్లు మంజూరు చేస్తున్న దృష్ట్యా అర్హులైన ప్రతిఒక్క లబ్ధిదారుడికి సకాలంలో సదరం ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ట్రెయినీ డీసీలు మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్, డీఆర్డీఓ ముషాయిదాబేగం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఝాన్సీ, పీఆర్ ఈఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సర్ ప్రక్రియ గడువు పొడిగింపు..
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఈ నెల 10 వరకు గడువు పొడిగించినట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఈ నెల 10 వరకు పొడిగించిందన్నారు. జిల్లాలో మొత్తం 5,03,859 ఎన్యూమరేషన్ ఫారాల్లో 4,38,852 (87.10 శాతం) ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఇంకా 63,488 యూఈఎఫ్లు, 1,519 ఎన్యూమరేషన్ ఫారాలు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ కూడా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


