అయిజ: మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధగా ఆక్రమించుకున్నారని, అక్రమ నిర్మాణాలు తొలగించాలని లోకాయుక్త ఆదేశించిందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రమణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని డిప్యూటీ డైరెక్టర్లు ఇస్మాయిల్, జైపాల్తో కలిసి సందర్శించారు. తహసీల్దార్ జ్యోతితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సర్వే నం.936 భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు కూల్చివేసి ప్రభుత్వ భూమికి కంచె వేయాలని సూచించారు. ఇదిలా ఉండగా అయిజలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, నిబంధనలకు విరుద్ధంగా అనేకమంది ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, అక్రమ నిర్మాణాలు తొలగించి, ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా ప్రకటించాలని అయిజకు చెందిన చాకలి ఆంజనేయులు లోకాయుక్తను 2017లోఆశ్రయించారు. దీంతో సర్వే నం.936లో ఉన్న మొత్తం 39 పేర్లను రికార్డుల నుంచి తొలగించారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చుకొని, ఇతరులకు విక్రయించి, రిజరిస్ట్రేషన్ చేయించారని చాకలి ఆంజనేయులు మళ్లీ లోకాయుక్తను ఆశ్రయించగా అక్రమంగా చేయించుకున్న రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అయినప్పటికీ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని వదలకపోవడంతో నిర్మాణాలను ఎందుకు తొలగించలేదని, దానికి కారణాలు తెలపాలని లోకాయుక్త అధికారులు తహసీల్దార్ జ్యోతిని ప్రశ్నించగా.. త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని తహసీల్దార్ వారికి చెప్పారు.


