మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి మంత్రోచ్ఛరణల మధ్య భక్తులు స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్రావు, సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి పాల్గొన్నారు.


