నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం
గద్వాల: ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సూచించారు. శనివారం గద్వాల మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సంఘాల ప్రతినిధులకు జలసిరి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఐదెకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులతో పంట కుంటలను తవ్వించాలని.. ఆగస్టు 15వ తేదీలోగా వాటి నిర్మాణాలను పూర్తి చేయించాలని ఆయన ఆదేశించారు. కుంటల్లో నిల్వ ఉన్న నీటితో రైతులు అరుతడి పంటలను సాగుచేసుకోవచ్చని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలసిరి, వీబీ–జీ రామ్జీ, వనమహోత్సవం తదితర అంశాలపై మంత్రి పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పనులు కల్పించాలని.. 12 కోట్ల పనిదినాల లక్ష్యన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీకాంత్, పీఆర్ ఈఈ ప్రభాకర్, జిల్లా పరిషత్ అధికారి శ్రీకాంత్, ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీఓ శైలజ ఉన్నారు.
సీపీఎస్తో అన్యాయం
గద్వాలన్యూటౌన్: సీపీఎస్ విధానంతో 22 ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని.. వెంటనే ఆ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానం అమలుచేయాలని సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా సహాధ్యక్షుడు సాతర్ల రఘు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణిత ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం భోజన విరామ సమయంలో చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక భద్రత కల్పించడంలో సీపీఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. రిటైర్డ్ అయిన వారి సంఖ్య 5వేలు దాటినా ఎవరికి పెన్షన్ రూ. 5వేలు దాటలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే వాటా, ఉద్యోగుల జీతాల నుంచి కట్చేసే సొమ్ము రెండింటిని ప్రాన్స్ అకౌంట్ వల్ల ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సీపీఎస్ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఆగస్టు 23న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.