చిన్నపాటి వర్షాలకే కుంగుతున్న రోడ్లు, భవనాలు
● జిల్లాలో ఎక్కువ శాతం నల్లపొలాలే..
● మట్టిలో నాణ్యత లేకుండానే నిర్మాణాలు
● పర్యవేక్షణపై అనుమానాలు
రాజోళి: రోడ్డు వేసి ఏడాది కూడా కాలేదు అప్పుడే గుంతలు పడుతున్నాయి. మా ఊరి రోడ్డు కనీసం రెండేళ్లు కూడా కాకముందే మోకాళ్ల లోతు గుంతలు పడ్డాయి. ఇవి జిల్లాలో తరుచూ వినిపించే మాటలు. పలుచోట్ల రోడ్లు వేసిన రోజుల వ్యవధిలో పెచ్చులు లేవడం, కంకర తేలడం జరుగుతోంది. ఇలాంటి సమస్యలన్నీ ఎక్కువ శాతం నల్లరేగడి భూమిలో వేసిన రోడ్లపైనే ప్రభావం ఉంటుందోని ప్రజలు అంటున్నారు. నల్లభూమిలో మరింత నాణ్యతతో రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపడితే ఎక్కువ కాలం మన్నిక ఇస్తాయని, కానీ అధికారులు సాధారణ భూముల్లో రోడ్లు వేసినట్లు పనులు పూర్తి చేస్తే తక్కువ కాలంలోనే అవి దెబ్బతింటాయని అంటున్నారు.
పర్యవేక్ష ణ కరువు
సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసేటప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉంటుందా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దెబ్బతిన్న నిర్మాణాలు కళ్లెదురుగా ఉన్నా కూడా అధికారులు మరోచోట నిర్మాణాలు చేస్తూ ప్రజల డబ్బును వృథా చేస్తున్నారంటున్నారు. నల్ల భూమిలో చేపట్టే నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో తెలిసినప్పుడు, అక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి, కంకర, కడ్డీ, సిమెంట్ వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ఇప్పుడు సగం కట్టి అలాగే వదిలేసిన నిర్మాణాల వల్ల ఎంత నష్టం తెచ్చాయో, వాటి కంటే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కోవెలదిన్నె, వల్లూరు రోడ్డుపై కల్వర్టు వద్ద జారిన మట్టి
జిల్లావ్యాప్తంగా..
గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, అయిజ తదితర మండలాల్లో ఎక్కువగా నల్లభూములే ఉన్నాయి. నీటి సాంద్రత తక్కువగా ఉన్నప్పటికీ పంటలకు బాగా ఉపకరించే స్వభావం ఉన్న ఈ భూములతో రైతులకు ప్రయోజనమే అయినప్పటికీ, ఇతర నిర్మాణాలకు మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ నేలలు చిన్నపాటి వర్షం కురిసినా బురదమయంగా తయారై, కిందకు కుంగుతాయి.


