గద్వాల క్రైం: నడిగడ్డలో దివిసీమగా పేరుగాంచిన గుర్రంగడ్డ ప్రాంతం ఎంతో అరుదైనదని డిప్యూటీ కలెక్టర్లు నన్నూరి మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్ అన్నారు. గురువారం వారు గద్వాల మండలంలోని గుర్రంగడ్డ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భూ భారతి రీ సర్వే కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో వివరాలు సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, ప్రకృతి, పర్యాటకం ఈ మూడు కలిసిన గ్రామంలోని ప్రజలను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామానికి రవాణా సౌకర్యం విషయంలో ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకుంటుందన్నారు. జములమ్మ దేవత జన్మస్థలంగా ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు ఉందన్నారు. నదీ ప్రాంతం కావడంతో బోటింగ్, పర్యాటక కార్యకళాపాలను అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్లో జిల్లాలోనే ప్రముఖ ప్రాంతంగా విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లకు కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పారు. అనంతరం భూ భారతి రీ సర్వే ద్వారా లక్ష్యాలు, భూ రికార్డుల కచ్చితత్వం, రైతులకు కలిగే ప్రయోజనాలు, భవిష్యత్లో భూ వివాదాల నివారణ, రికార్డుల పారదర్శకత వంటి విషయాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.


