అయిజ: దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే.. రోడ్డు, రవాణా సౌకర్యం బాగుండాలి. కానీ, జోగుళాంబ గద్వాల జిల్లాలో రహదారుల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పల్లె దారులు పక్కనపెడితే.. అంతర్రాష్ట్ర రహదారులు సైతం అధ్వానంగా మారడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఇక్కడి అంతర్రాష్ట్ర రహదారులపై చాలా చోట్ల హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు వర్షం కురిసిన సందర్భాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వాహనాలు ఇరువైపులా నిలిచిపోయి.. అవాంతరాలు సృష్టిస్తున్నాయి. అలాగే అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం రాని పరిస్థితి నెలకొనడంతో ప్రజల ప్రాణాల మీదకు వస్తున్న సంఘటనలు లేకపోలేదు.
ప్రమాదకర కాజ్వేపైనే..
ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో అనుసంధానం చేసే వాటిలో కీలకమైనవి అంతర్రాష్ట్ర రహదారులు. అయితే అయిజ సమీపంలోని పెద్దవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించకపోవడంపై శిథిలావస్థకు చేరి రంద్రాలు పడిన కాజ్వేపైనే ప్రజలు ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే మేడికొండ రోడ్డు సమీపంలోని వాగుపై హైలెవల్ బ్రిడ్జి పనులు సగంలోనే నిలిచిపోయాయి. ఈ రెండు హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతోపాటు రవాణా, ఆర్థిక, సామాజిక, భద్రతా కోణాలలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.


