జడ్చర్ల పట్టణంలోనే బాదేపల్లిలో 30 పడకల ఆస్పత్రి ఉండేది. దీన్ని బీఆర్ఎస్ హయాంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కల్వకుర్తి రోడ్డులో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనంలోకి మార్చారు. ప్రారంభ సమయంలో మార్చురీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాదేపల్లి ఆస్పత్రి పరిధిలోని మార్చురీలోనే మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. మృతదేహాలను సైతం అక్కడే భద్రపరుస్తున్నారు. కిలోమీటరున్న దూరంలో ఉండగా.. పర్యవేక్షణ కొరవడడంతో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ ముందుగా బాదేపల్లిలో మార్చురీ, ఆ తర్వాత కల్వకుర్తి రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి, మార్చురీని సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్చురీలో ఉన్న మూడు ఫ్రీజర్లను పరిశీలించారు. మార్చురీ నిర్మాణం పూర్తయి అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. పాత ఆస్పత్రినే పోస్టుమార్టం నిర్వహించడంపై అధికారులు, డాక్టర్లకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఆస్పత్రి నిర్వహణ, వైద్యుల పనితీరు సరిగ్గా లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేయడం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే దానికి అద్దం పడుతోంది.


