
జోగుళాంబ ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఉమ్మడి నల్గొండ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి గురువారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. అనంతరం వారికి శేషవస్త్రాలతో సత్కరించారు. వీరితోపాటు పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి, జిల్లా మాజీ గౌరవ అధ్యక్షుడు వెంకటరామయ్య శెట్టి, జిల్లా అధ్యక్షుడు మచ్చర్ల తిమ్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎన్ వేణుగోపాల్ ఉన్నారు.
నర్సరీల నిర్వహణ
సక్రమంగా ఉండాలి
అలంపూర్: నర్సరీల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని, మొక్కలు జూన్ నాటికి కనీసం మీటర్ ఎత్తులో ఉండే విధంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. గురువారం అలంపూర్ మండలం ర్యాలంపాడులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన గ్రామీణ అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో పశు కొట్టాల నిర్మాణం, నర్సరీ అభివృద్ధి పనులు పరిశీలించారు. పనుల నాణ్యతతోపాటు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం అలంపూర్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
వంద రోజులు పని దినాలు కల్పించాలి
పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కూలీలతో డిమాండ్లపై అడిషనల్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించాలని, ప్రతి పనిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామాల వారీగా మైక్రో ప్లాన్లు సిద్ధం చేయాలని, ఈమేరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పని ప్రదేశంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ వసతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి. కేజీవీ ప్రన్సిపల్ కృష్ణవేణి. ఏపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలలో ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన పలువురు ఉన్నారు. వీరిలో నాగర్కర్నూల్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జి.సబిత యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రామన్నపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కల్వకుర్తి జడ్జికి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కోర్టులో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నసీం సుల్తానాను నాగర్కర్నూల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న వి.ఈశ్వరయ్యను మహబూబ్నగర్ జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. సికింద్రాబాద్లోని రాష్ట్ర జుడీషియల్ అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎన్.వెంకట్రాంను నాగర్కర్నూల్ జిల్లా కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జిగా రానున్నారు. గద్వాల జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న టి.లక్ష్మిని అక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. అలాగే ఇదే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా కవితాదేవిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు.

జోగుళాంబ ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ