● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ
జనగామ రూరల్: కక్షిదారులు పంతాలకు పట్టింపులకు పోకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ సూచించారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈసందర్భంగా పలువురికి రాజీ పత్రాలను అందజేశారు. కుటుంబ సభ్యులు పంతాలకు పోకుండా కేసు పెట్టకుండా గ్రామ పరిధిలోనే పరిష్కరించుకోవాలని రాజీ మార్గం ఉత్తమమైందన్నారు. లోక్ అదాలత్లో ఐదు బెంచ్ల ద్వారా కేసులను పరిష్కరించారు. మొదటి బెంచ్కు ప్రధాని న్యాయమూర్తి బి. ప్రతిమ, న్యాయవాది ఉపేందర్, రెండో బెంచ్కు సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి, కె.సునీతారాణి, మూడో బెంచ్కు జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, బి.స్వప్న, నాలుగో బెంచ్కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప్, రాగల శ్రీహరి, ఐదో బెంచ్కు స్టేషన్ ఘన్పూర్ జూనియర్ సివిల్ జడ్జి కె.శివలీల, విజయభాస్కర రావు ప్రాతినిథ్యం వహించారు. లోక్ అదాలత్లో ప్రీ లిటిగేషన్ కేసులో సివిల్, క్రిమినల్ కేసులు 475 పరిష్కరించి వారి నుంచి రూ. 22,11,198 వసూలు కాగా సివిల్ కేసులు 172 కు గాను రూ. 24,75,000 క్రిమినల్ కేసులు 983 లకు రూ.24,03,950 వసూలు కాగా మొత్తం కేసులు 1,630లకు రూ. 70,90,148 వసూలు చేశారు.


