● అధ్యక్ష, కార్యదర్శులుగా కరుణాకర్,
వీరభద్రరావు
● ఎన్నికల తీరును పరిశీలించిన సీపీ శ్వేత
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఎన్నికలకు నోడల్ అధికారిగా అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్య వ్యవహరించారు. ఈ ఎన్నిక సందర్భంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ ఎన్నికల్లో 110 మంది వివిధ హోదాలు కలిగిన పోలీస్ అధికారులు తమ ఓటు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కానిస్టేబుల్ కొండా కరుణాకర్ (ధర్మసాగర్ పోలీస్ స్టేషన్), ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ టి.బాబుపై 17 ఓట్ల అధిక్యంతో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి.సతీష్(ఆర్.ఐ), బి.శరత్ కుమార్(ఆర్.ఎస్ఐ), ప్రధాన కార్యదర్శిగా ఇ.వీరభద్రరావు (దామెర ఎస్ఐ), సంయుక్త కార్యదర్శిగా టి.నరేష్ (కాజీపేట కానిస్టేబుల్), కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్.ప్రవీణ్ కుమార్ (ఏఆర్ కానిస్టేబు ల్), కోశాధికారి బి.నరేష్ (పాలకుర్తి కానిస్టేబుల్), కార్యనిర్వాహక సభ్యులుగా ఎం.తులసి (మహిళా కానిస్టేబుల్ కాజీపేట), సీహెచ్ మహేందర్ యాదవ్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎ.రమేష్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎన్.ప్రవీణ్ (సుబేదారి కానిస్టేబుల్), ఎండీ తాజుద్దీన్ (హనుమకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్), పి.సర్వేశ్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. కాగా, సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అభినందనలు తెలిపారు.


