● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య
జనగామ రూరల్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ విధానాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెనన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన రిజర్వేషన్ అమలు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ, పదోన్నతులు, సేవా అంశాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇతర సమస్యలపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్తో కలిసి వారు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, వర్గాల వారికి అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులను, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, వాటి పురోగతిపై చైర్మన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈపందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కులను పరిరక్షించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్ ప్లాన్ నిధులలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె.లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, సంతోష్ నాయక్, శంకర్, హౌజింగ్ పీడీ మాతృనాయక్, సీపీఓ చినకోట్యా నాయక్, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


