ఈ–కేవైసీకి నెలాఖరు
వరకు అవకాశం
జనగామ: రేషన్ కార్డు ఇక సాధారణ రూపం నుంచి స్మార్ట్ రూపంలోకి మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కా ర్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా రేషన్ కార్డుదారులకు కొత్త కార్డులు అందించేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో జిల్లాలోని రేషన్ కార్డుదారుల కుటుంబాల్లోనూ కొత్త కార్డులపై ఆసక్తి నెలకొంది. కొత్త కార్డుల ప్రధాన ఉద్దేశం రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకతను పెంచడంతో పాటు అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ ప్ర యోజనాలు సులభంగా చేరేలా చేయడమే. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆధార్ ఆధారిత వ్యవస్థ ద్వారా కొనసాగుతోంది. స్మార్ట్ కార్డుల రాకతో కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ పొందే వివరాలు మరింత క్రమబద్ధంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఒక కార్డు.. అనేక ప్రయోజనాలు
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన కుటుంబ డిజిటల్ కార్డు విధానంలో రేషన్, ఆరోగ్యం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఒకే కుటుంబ వివరాలతో అనుసంధానించే ఆలోచనను వెల్లడించింది. కుటుంబ సభ్యుల వివరాలను అవసరానికి అనుగుణంగా చేర్చడం, తొలగించడం వంటి మార్పులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశం కూడా ఉంది. జిల్లాలో అర్హులైన ప్రతీ కుటుంబానికి కార్డు అందేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కొత్త కార్డు ద్వారా రేషన్ సరుకులు పొందడంలో ఇబ్బందులు తగ్గడంతో పాటు, భవిష్యత్లో సంక్షేమ పథకాల అమలులో కుటుంబ వివరాల ఆధారంగా సేవలు అందించే దిశగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా స్మార్ట్ రేషన్ కార్డు పేద కుటుంబాల సంక్షేమానికి మరింత చేరువ చేసే డిజిటల్ గుర్తింపుగా మారనుంది.
82శాతం చేరుకున్న ఈ–కేవైసీ
జిల్లాలో రేషన్ కార్డుల ఈ–కేవైసీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అన్ని కేటగిరీలకు కలిపి జిల్లాలో 1,15,038 రేషన్ కార్డులు ఉండగా, వాటి పరిధిలో 5,68,817 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు 4,63,637 మందికి పైగా ఈ–కేవైసీ ప్రక్రియ ను పూర్తి చేసుకున్నారు. అంటే దాదాపు 82 శాతాని కి పైగా మంది లబ్ధిదారుల ఈ–కేవైసీ పూర్తయింది. మరో 18 శాతం లోపు మంది ప్రక్రియను పూర్తి చే యాల్సి ఉంది. రేషన్ కార్డుల వివరాలను డిజిటల్ విధానంలో క్రమబద్ధీకరించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు స క్రమంగా అందేలా ఈ–కేవైసీ కీలకంగా మారింది.
ప్రభుత్వం ఈ–కేవైసీ చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. దీంతో మిగిలిన లబ్ధిదారులు గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఈ నెల15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ–కేవైసీ పూర్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడువు ముగిసిన తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా మిగిలిన కుటుంబ సభ్యులు వెంటనే ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈనెల 15 నుంచి కుటుంబాలకు కొత్త కార్డులు
పేదలకు సంక్షేమ ప్రయోజనాలు
మరింత సులభతరం
రేషన్ కార్డులకు ఈ–కేవైసీ తప్పనిసరి


