జనగామ/జనగామ రూరల్: విద్యార్థుల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంపొందించి ప్రమాదాలను నివారించడంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల పాత్ర కీలకమని టీజీఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, డీపీఈ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ పి.శ్రీకాంత్ అన్నారు. టీజీఎన్పీడీసీఎల్ జనగామ ఎస్ఈ సీహెచ్.సంపత్రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్మా జిల్లా శాఖ సహకారంతో బుధవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో ప్రైవేట్ పాఠశాలల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన విద్యుత్ భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు, వాటి నివారణ చర్యలు, పాఠశాలలు, గృహాల్లో పాటించాల్సిన భద్రతా నియమాలు, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన విధానాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు చేరవేసి విద్యుత్ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యుత్ భద్రతా సంస్కృతిని పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. శిక్షణలో పాల్గొన్న 60 మంది ఉపాధ్యాయులకు ధ్రువపత్రాలు, పాఠశాలల్లో అవగాహన కార్య క్రమాలు నిర్వహించేందుకు విద్యుత్ భద్రతపై పవర్పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించిన సమాచార పత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షుడు పి.సంజీవ్రెడ్డి, జనగామ డివిజన్ అధ్యక్షుడు రాంరెడ్డి, స్టేషన్ఘన్పూర్ డివిజన్ అధ్యక్షుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ డీపీఈ, సీనియర్ ఫ్యాకల్టీ శ్రీకాంత్


