ఈ నెల 31 వరకు ‘చేయూత’ దరఖాస్తులు
కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
జనగామ: ప్రభుత్వం అర్హులైన కొత్తవారికి చేయూత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఒంటరి మహిళలు, వితంతులు, గీత, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులతో పాటు దివ్యాంగులు, తలసే మియా, సికిల్సెల్, హీమోఫీలియా బాధితులకు చోటు కల్పించారు.
ఈ నెల 31న దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని సంబంధిత సాంకేతిక విభాగం సమాచారం. అనంతరం గెజిటెడ్ అధికారి పర్యవేక్షణలో క్షేత్రస్థాయి అధికారులతో కలిసి థర్డ్పార్టీ విచారణ చేపట్టే అవకాశం ఉంది. అర్హతల పరిశీలనలో కుటుంబ ఆర్థిక పరిస్థితి, భూమి, వాహనాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐదు ఎకరాలకు మించి భూమి కలిగి ఉండటం వంటి నిబంధనలు ఉన్నట్లు సమాచారం. అయితే అర్హతలు, అనర్హతలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి అధికారికంగా వెలువడాల్సి ఉంది. పరిశీలన, విచారణ ప్రక్రియ పూర్తయిన అనంతరం వచ్చే నెల చివరి వారంలో కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ప్రస్తుతం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతోంది. జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీల పరిధిలోని దరఖాస్తులను ఎంపీడీఓ కార్యాలయాల్లో నమోదు చేస్తున్నారు. వృద్ధాప్యంతోపాటు ఇతర కేటగిరీల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అదే సమయంలో మరణించిన లబ్ధిదారుల పేర్లను ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్ ద్వారా తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది.
కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆశావహుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియపై అవగా హన కల్పించడంతోపాటు అవసరమైన సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉండటంతో రాజకీయ నా యకులు ఈ అంశంపై దృష్టి పెట్టారు. అర్హులైన వా రి వద్దకు వెళ్లి దరఖాస్తులు చేయించేందుకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు పోటీ పడుతున్నారు. భవిష్యత్లో పింఛన్ మంజూరైతే తమ చొరవతోనే వచ్చిందని చెప్పుకుని ఓట్లు అభ్యర్థించే పరిస్థితి ఉంటుందనే చర్చ జరుగుతోంది. నాయకులు ఇళ్లకు వెళ్లిన సందర్భంలో వృద్ధాప్య అర్హత ఉన్న తమకు పింఛన్ ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో నాయకులు వారికి సర్దిచెబుతూ అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి అవకాశం కల్పించేలా ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు 27 వేలకు పైగా అర్జీలు
వచ్చే నెలలో అర్హులకు పింఛన్లు
మంజూరయ్యే అవకాశం
గ్రేడ్– 2, గ్రేడ్– 3 పైలేరియా బాధితులు, ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చికిత్స పొందుతున్న వారికి వయోపరిమితి లేకుండా పింఛన్ మంజూరు చేయనున్నారు. వీరిని సంబంధిత వైద్య, ఆరోగ్యశ్రీ విభాగాలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అర్హులు పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి లేదా ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం 73,829 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.18.32 కోట్ల మేర ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం ఇప్పటివరకు సుమారు 27వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనుంది.


