నాడు శత్రువు.. నేడు మిత్రులు..
జనగామ: జనగామ మున్సిపల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, మిత్రపక్ష సీపీఎం పార్టీలకు చెందిన సుమారు 16 మంది కౌన్సిలర్లు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో కొందరు కౌన్సిలర్ల భర్తలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. సుధీర్ఘంగా సాగిన ఈ భేటీలో ప్రధానంగా మున్సిపల్ పరిపాలన, కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు, వార్డుల అభివృద్ధి పనులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రహస్య భేటీలో ఏంటీ..!
కౌన్సిలర్ల రహస్య భేటీలో కమిషనర్ రాజశేఖర్రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, వార్డుల పర్యటనలకు సంబంధించి కౌన్సిలర్లకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని, మున్సిపల్ శాఖల అధికారులను ఫోన్లో సంప్రదించినా స్పందన లేకపోవడం, వివిధ అభివృద్ధి పనులు వంటి అంశాలపై చర్చలో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతీవార్డుకు కేటాయించిన రూ.5 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కేటాయింపు చేయక పోవడమే ఈ చర్చకు కారణమని తెలుస్తుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపైనా చర్చ జరిగినట్లు తెలుస్తుండగా, ఇది కేవలం అసంతృప్తి వ్యక్తీకరణకే పరిమితమవుతుందా..లేక అధికారికంగా తదుపరి చర్యలకు దారితీస్తుందా.. అన్న అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ రహస్య సమావేశానికి సూత్రధారులు ఎవరు, వివిధ పార్టీల కౌన్సిలర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన కారణాలు ఏమిటి అన్న దానిపైనా ఆసక్తి నెలకొంది.
ఒకే వేదికపై మూడు పార్టీల సభ్యులు
సమావేశం వెనక రాజకీయ వ్యూహమా?
కమిషనర్ ఏకపక్ష నిర్ణయంపై చర్చ?
మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర రాజకీయ పోటీ నెలకొన్న నేపథ్యంలో, ప్రస్తుతం ఈ రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఒకే వేదికపై సమావేశం కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భేటీ ఉద్దేశం రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం, అధికారులతో మెరుగైన సమన్వయం సాధించడమేనని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. అ ధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఈ సమావేశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుత కమిషనర రాజశేఖర్రెడ్డి కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మున్సిపల్కు ఏటా వచ్చే ఆదాయం పెరగడం గమనార్హం.


