హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం అమ్మవారిని విరోధిని, వహ్నివాసినిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీ క్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విరోధిని క్రమంలో, షోడశీ క్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని వహ్నివాసిని క్రమంలో అలంకరించి విశేష పూజలు చేశారు. మహిళలు హాజరై అమ్మవారికి చీర, సారె సమర్పించారు. సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.


