అనుమతిలేని పనులు | - | Sakshi
Sakshi News home page

అనుమతిలేని పనులు

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

● చెరువు వద్ద అమృత్‌ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల బాధ్యతను ఉన్నతాధికారులు పబ్లిక్‌ హెల్త్‌ శాఖకు అప్పగించారు. అక్కడ పనులు ప్రారంభించడానికి ముందుగా జల వనరుల శాఖ నుంచి అనుమతి(ఎన్‌ఓసీ) పొందాల్సి ఉంటుంది. ● అనుమతి పొందకుండానే పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు కట్ట నిర్మాణం మొదలుపెట్టారు. దీనిని ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌) పరిధిలో చేపట్టడంతో నీటి సామర్థ్యం తగ్గిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● మరోవైపు అక్కడ 63మీటర్ల వెడల్పుతో వరద నీరు వెళ్లే మత్తడి మార్గాన్ని కట్ట నిర్మాణంలో కలిపేశారు. ● రెండు నెలల క్రితం చెరువులో సుమారు ఐదు లక్షల చేప పిల్లలను వదిలారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ● మత్తడి స్థానంలో కొత్తగా కట్ట ఏర్పాటుచేయగా.. మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ గండి కొట్టారు. దీంతో పెద్ద మొత్తంలో నీరు, అందులో ఉన్న చేపలు బయటకు వెళ్లిపోయాయి. ● ఈ చర్యతో చెరువుపై ఆధారపడిన మత్స్యకారులు తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. ● ఎన్‌ఓసీ పొందకుండా పనులు మొదలుపెట్టడంపై జల వనరుల శాఖ స్థానిక అధికారులు.. పబ్లిక్‌ హెల్త్‌ శాఖకు నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కట్ట నిర్మాణం చేపట్టడం సరికాదని అందులో హెచ్చరించినప్పటికీ ఆ శాఖ అధికారులు పట్టించుకోకుండా పనులు కొనసాగించడం గమనార్హం. ● అలాగే కట్టకు గండి కొట్టిన సంఘటనపైనా జలవనరుల శాఖ అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏదేమైనా అభివృద్ధి పనుల విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన పబ్లిక్‌ హెల్త్‌ శాఖ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీలో ప్రధానమైన పెద్ద చెరువును సుందరీకరించడానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో ఎనిమిది మీటర్ల వెడల్పు, సుమారు రెండు కిలోమీటర్ల మేర వాకింగ్‌ ట్రాక్‌కు అనుకూలంగా ఉండేలా కట్టను నిర్మించారు. నీటి ప్రవాహానికి కట్ట కోతకు గురి కాకుండా ఇరువైపులా రాళ్లతెట్ట ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ మరికొన్ని పనుల కోసం కేంద్రప్రభుత్వ అమృత్‌ 2.0 పథకం కింద సుమారు రూ.3కోట్లు కేటాయించింది. జంగిల్‌ క్లియరెన్స్‌, కట్ట నిర్మాణం, లైటింగ్‌, యోగాకేంద్రం వంటి పనులు చేపట్టాల్సి ఉంది.

ఎన్‌ఓసీ పొందకుండానే..

కట్టకు గండితో మత్స్యకారులకు నష్టం

అటు నోటీసు..ఇటు పోలీసులకు ఫిర్యాదు

అమృత్‌ నిధులతో పెద్ద చెరువు సుందరీకరణకు శ్రీకారం

జల వనరుల శాఖ అనుమతి లేకుండానే పనుల కొనసాగింపు

నిబంధనలు పట్టించుకోని పబ్లిక్‌ హెల్త్‌ శాఖ అధికారులు

మత్తడి తొలగించి కట్ట ఏర్పాటుపై విమర్శలు

చెరువుకు గండి కొట్టడంపై పోలీసులకు ఫిర్యాదు

మౌఖిక అనుమతితో పనులు

చెరువు వద్ద కట్ట నిర్మాణానికి జల వనరుల శాఖ అధికారులు ఎనోవోసీ ఇవ్వడం కుదరదన్నారు. వారు మౌఖికంగా ఇచ్చిన అనుమతితో పనులు మొదలుపెట్టాం. వచ్చిన నిధులు లాప్స్‌ అయ్యే అవకాశం ఉండడంతో గత్యంతరం లేక పనులు ప్రారంభించాం. మత్తడి స్థానంలో ఏర్పాటు చేసిన కట్టను తొలగిస్తాం. అక్కడ తిరిగి మత్తడి నిర్మిస్తాం.

– నాగేశ్వర్‌రావు, మున్సిపల్‌ డీఈ

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం

మత్తడి స్థానంలో ఏర్పాటు చేసిన కట్టకు గండి కొట్టిన విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. గండి కొట్టడం ద్వారా మత్స్యకారులకు నష్టం జరిగింది. విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం.

– అనురాగ్‌, ఏఈ, జలవనరుల శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement