● అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్
కొడిమ్యాల: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజాగౌడ్ అన్నారు. మండలంలోని పూడూరులో వచ్చిన దరఖాస్తుల పరిశీలించారు. నిబంధనల మేరకు దరఖాస్తులను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, అవసరమైన సమాచారాన్ని చేరవేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో భగవాన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ భూమిని స్వాధీనం చేసుకోండి
జగిత్యాలటౌన్: యాజమాన్య హక్కులు లేకున్నా.. కిబాలా పేరుతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఔట్లెట్ కోసం కేటాయించినట్లు చెబుతూ ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న జిల్లాకేంద్రంలో రూ.కోట్లు విలువ చేసే మున్సిపల్ భూమిని స్వాధీనం చేసుకోవాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు. 1960కి ముందు దారం వీరమల్లయ్యకు పట్టణంలోని సర్వే నంబర్ 138లోని 20గుంటల భూమిని కేటాయించినట్లు చెబుతున్నా.. నాలుగు గుంటల్లోనే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తూ.. మిగతా 16గుంటలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వీరమల్లయ్యకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేకున్నా ఆయన వారసులమని చెప్పి 16గుంటలు విక్రయించారని తెలిపారు. ఆక్రమణదారులపై మున్సిపల్ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. యాజమాన్య హక్కులు లేకున్నా నివాసం ఉంటున్నట్లు కోర్టును నమ్మించారని తెలిపారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తల్లిపాలే బిడ్డకు తొలి టీకా
పెగడపల్లి: తల్లిపాలు బిడ్డకు తొలి టీకా వంటివని వైద్య ఆరోగ్యశాఖ ఇమ్యూనైజేషన్ అధికారి నరేంద్ర అన్నారు. మండలంలోని ఆరవెల్లి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు పట్టాలని, ఆ పాలు నవజాత శిశువుకు సహజ రక్షణ కవచంలా పని చేస్తాయని తెలిపారు. బిడ్డకు అవసరమైన పోషకాలు అందులో పుష్కలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పులంచె భవాని, ఐసీడీఎస్ సూపర్వైజర్ మహేశ్వరి, అంగన్వాడి టీచర్లు సత్య, శంకరమ్మ, తల్లులు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. అనంతరం నరేంద్ర ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. వైద్యాధికారి నరేశ్, సీహెచ్వో సందీప్, సూపర్వైజర్లు శ్రీని వాస్, జగదీశ్, జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీఐలో ప్రవేశాలకు నోటిఫికేషన్
జగిత్యాల: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ద్వితీయ దశ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైందని ఐటీఐ ఏటీసీ సెంటర్ ప్రిన్సిపల్ గంట్యాల రవీందర్ తెలిపారు. కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారు వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని, మొదటి దశ దరఖాస్తు చేసుకుని సీటు పొందనివారు తిరిగి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వారు వాకిన్ ప్రవేశాలకు హాజరు కావచ్చని తెలిపారు. ఆన్లైన్లోనే దరఖాస్తు తప్పనిసరి అని, వెబ్సైట్లో ఖాళీ సీట్ల వివరాలు అందుబాటులో ఉంచామని, తమకు నచ్చిన ట్రేడ్, కళాశాలలో ఖాళీ ఉంటే ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. ఈనెల15 వరకు పొందిన ప్రవేశం తుది ఫైనల్ అని, తర్వాత రెండో అవకాశం, మార్పు ఉండదని తెలిపారు. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్స్తో ధరూర్ క్యాంప్లోని ప్రభుత్వ ఐటీఐలో హాజరు కావాలని సూచించారు.


