● ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాల్లో కోత ● ఆందోళనలో ఉద్యోగులు
జగిత్యాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల వేతనాలు తగ్గిస్తూ జారీ అయిన 69జీవోపై సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వేతనాలు తగ్గించినట్లు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో కంప్యూటర్ ఆపరేటర్లు 15 మంది, వర్క్ ఇన్స్పెక్టర్లు 18 మంది, డ్రైవర్లు 78 మంది పనిచేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.23,750 వేతనం ఇవ్వగా.. రూ.4250 తగ్గించి రూ.19,500, వర్క్ ఇన్స్పెక్టర్లకు రూ.23,750 ఉండగా.. రూ.7,150 తగ్గించి రూ.16,600, శానిటరీ ఇన్స్పెక్టర్లకు రూ.23,750 ఉండగా, రూ.7,150 తగ్గించి రూ.16,600, డ్రైవర్లకు రూ.19,500 ఉండగా రూ.2900 కోత పెట్టి రూ.16,600 చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు వేతనాలు తగ్గించడం ద్వారా కుటుంబంపై పెను ప్రభావం పడుతుందంటున్నారు. మున్సిపాలిటీల్లో డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల సేవలు చాలా అవసరం. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీరికి వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి.
స్పెషల్ ఆఫీసర్కు వినతి
వేతనాల తగ్గించడం ద్వారా తమ కుటుంబాలపై ఆర్థిక ప్రభావం పడుతోందని, తమను ఆదుకోవాలని కోరుతూ జిల్లా స్పెషల్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్కు ఔట్ సోర్సింగ్ సిబ్బంది వినతిపత్రం అందించారు.
విద్యుత్ పునరుద్ధరణ
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం బట్టపల్లిలో వారం క్రితం ఈదురుగాలులు, వర్షాలకు విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాట్లు వేసిన పొలాలు ఎండిపోతుండటంతో ‘కరెంట్ లేక ఎండుతున్న పొలాలు’ శీర్షికన ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించింది. స్పందించిన ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ సిబ్బందితో విద్యుత్ స్తంభాలు వేసి కరెంట్ పునరుద్ధరించారు.


