● అప్రమత్తత కీలకం ● ఎస్పీ అశోక్కుమార్
కోరుట్ల: సైబర్ నేరాలపై అప్రమత్తత కీలకమని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. కోరుట్లలో బుధవారం నిర్వహించిన సైబర్ జాగృతి దివస్లో సదస్సులో పాల్గొన్నారు. స్మార్ట్ఫోన్ రాకతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, గుర్తు తెలియని యాప్లు వినియోగిస్తే మోసపోయే ఆస్కారం ఉందన్నారు. సీబీఐ, ఇన్కంటాక్స్, పోలీస్ల పేరిట మోసాలు జరుగుతున్నాయని, ఆయా శాఖల అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు, వీడియో కాల్స్తో సంప్రదింపులు చేయబోరని తెలిపారు. కష్టపడకుండా డబ్బులు రావని, ఆన్లైన్ గేమ్లతో ఇబ్బందులు తప్పవన్నారు. అందమైన అమ్మాయిలు పేరిట మేసేజ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు యూరియా సబ్సిడీ పేరిట జరిగే మోసాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే ఫిర్యాదు చేయాలని, ఆలస్యం చేస్తే డబ్బుల రికవరీ కష్టతరంగా మారుతుందని, వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలన్నారు. అడిషనల్ ఎస్పీ నితిన్చేతన్, మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మణ్కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
ముందస్తు నిర్ధారణతో క్షయ నివారణ
రాయికల్: ముందస్తు నిర్ధారణ పరీక్షలతో క్షయవ్యాధి నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అల్లీపూర్ ఆరోగ్య కేంద్రంలో బుధవారం డిజిటల్ మొబైల్ ఎక్స్రే మిషన్ ద్వారా క్షయ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలుంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. నూతన ఎక్స్రే మిషన్తో గ్రామీణ ప్రాంతాల్లోనూ వెంటనే వ్యాధి నిర్ధారణ చేస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో 45 మందికి పరీక్షలు చేశారు. సర్పంచ్ ఎంబారి గౌతమి, వైద్యాధికారి సతీష్ కుమార్, ఎంఎల్హెచ్పీ సుప్రియ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


