కొడిమ్యాల: మండలంలోని నల్లగొండ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ఆలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆశీర్వదించి.. తీర్థప్రసాదాలు అందించారు. శేషవస్త్రంతో సత్కరించారు. స్థానిక బీజేపీ నాయకులు ఆలయ ప్రాంగణంలో భక్తుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. నిధులు మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆలయ అధికారులు, బీజేపీ నాయకులు బండా నరసింహారెడ్డి, హరీశ్, శోభన్, ప్రశాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


