హర్మూజ్ జలసంధిలోకి వచ్చే ఏ నౌకనైన ఇక నుంచి తాము అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్లోకి రావడానికి ఇరాన్ అనుమతి తీసుకుని వారికి సుంకం చెల్లించిన పక్షంలో ఏ దేశ నౌకనైనా తాము బ్లాక్ చేస్తామన్నారు. ఇరాన్కు సుంకం చెల్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికాతో ఇరాన్ చర్చలు విఫలమైన అనంతరం చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో ట్రంప్.. హర్మూజ్ అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించే ఏ నౌకను కానీ, తిరిగి వెళ్లే ఏ నౌకనైనా తాము అడ్డుకోవడం ఖాయమన్నారు. ఇది ఇప్పట్నుంచే అమల్లోకి వస్తుందన్నారు ట్రంప్. ఇరాన్కు సుంకం చెల్లించే ప్రతీ నౌకను అమెరికా దళాలు దిగ్బంధిస్తాయన్నారు.
ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్ ట్రంప్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవడానికి వాగ్దానం చేసింది, కానీ వారు ఉద్దేశపూర్వకంగా అది చేయలేదు. దీని వల్ల ప్రపంచంలోని అనేక మంది ప్రజలకు, అనేక దేశాలకు ఆందోళన, అవ్యవస్థ, బాధ కలిగింది. వారు నీటిలో మైన్స్ వేశారని చెబుతున్నారు, అయితే వారి నౌకాదళం మొత్తం, అలాగే ఎక్కువ భాగం మైన్స్ వేసేవాళ్లను మేము తుడిచిపెట్టేశాం. ఇంకా వాటర్ మైన్స్ ఉన్నా దాన్ని తొలగిస్తాం. ఆ సమయంలో మాపై దాడి జరిగితే విధ్వంసం సృష్టిస్తాం. అణుకార్యక్రమాన్ని వదలడానికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అందుకే చర్చలు విఫలమయ్యాయి.
ఎవరైనా ఇరాన్కు సుంకం చెల్లించి హర్మూజ్ జలసంధిలోకి రావాలన్నా, అక్కడ నుంచి బయటకు వెళ్లాలన్నా వాటిని అమెరికా దళాలు దిగ్భందిస్తాయి.’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.


