కంపాలా: తండ్రి దేశాధ్యక్షుడు. కుమారుడు ఆర్మీ చీఫ్ జనరల్. ఆర్మీ చీఫ్ హోదాలో కుమారుడు సహచర దేశానికి మరోసారి రెండు కండీషన్లు పెట్టాడు. వన్ బిలియన్ డాలర్లు ఇవ్వాలని, ఆ దేశంలో అత్యంత అందమైన యువతితో తన వివాహం జరిపించాలని ట్వీట్ చేశాడు. ఇందుకోసం 30 రోజుల గడువు కూడా ఇచ్చాడు. ‘మా దేశ రాజధానిలోనే మీ రాయబార కార్యాలయం ఉంది. డిమాండ్లను అంగీకరించకపోతే దౌత్యపరమైన ఇబ్బందులు తప్పవు’ అంటూ హెచ్చరికలు జారీ చేశాడు.
గతంలోనూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని తనకు వివాహం జరిపించాలని ప్రతిపాదనలు పంపాడు. అందుకు గాను 100 అంకోలే ఆవులను ఆఫర్ చేశాడు. ‘రోమన్లు మా ఆవులను తిరస్కరిస్తే.. రోజుల వ్యవధిలోనే మేము రోమ్ను స్వాధీనం చేసుకుంటాం’అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించాడు. తండ్రి చివాట్లు పెట్టినా బుద్ధి మార్చుకోలేదు. తాజాగా మరోసారి వింత కోరికతో ఆయన సొంత దేశంలో హాట్ టాపిక్గా మారాడు. ఇంతకీ ఎవరా ఆర్మీ చీఫ్ జనరల్.
ముహోజి కైనెరుగాబా ఉగాండా అధ్యక్షుడు యోవెరి ముసేవెనీ కుమారుడు, ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహోజి కైనెరుగాబా చేసిన తాజా డిమాండ్లు అంతర్జాతీయంగా వివాదానికి దారితీశాయి. టర్కీ తమ దేశానికి వన్ బిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వాలని, అలాగే ఆ దేశంలో అత్యంత అందమైన మహిళను తనకు భార్యగా ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరకపోతే 30 రోజుల్లో టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేసి, దౌత్య సంబంధాలను తెంచేస్తామని హెచ్చరించారు.
‘ఉగాండా సైన్యం రెండు దశాబ్దాలుగా సోమాలియాలో అల్-షబాబ్ ఉగ్రవాదులపై పోరాడుతూ త్యాగాలు చేస్తోంది. కానీ టర్కీ మాత్రం అక్కడి పోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ద్వారా లాభాలు పొందుతోందని ఆరోపించారు. అందుకే ‘సెక్యూరిటీ డివిడెండ్’ పేరుతో ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది మొదటిసారి కాదు. 2022లో ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి తనకు వివాహం జరిపించాలని డిమాండ్ చేశారు. బదులుగా వంద అంకోలే ఆవులను ఇస్తానని మాటిచ్చారు.
రోమన్లు మా ఆవులను తిరస్కరిస్తే, మేము రోమ్ను స్వాధీనం చేసుకోవాలి. అది మాకు రోజులు మాత్రమే పడుతుంది’అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన తండ్రి, అధ్యక్షుడు యోవెరి ముసేవెనీ, తన కుమారుడి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ‘ మిత్ర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదు’ అంటూ చివాట్లు పెట్టారు.
గతంలో ముహోజి కైనెరుగాబా కెన్యాను సైతం ఇలాగే బెదిరించాడు. 2022లో నేను నా సైన్యంతో కలిసి రెండు వారాల్లోనే నైరోబీని స్వాధీనం చేసుకోవచ్చు’ అని ప్రకటించారు. ఈ బెదిరింపుల కారణంగా తాత్కాలికంగా ముహోజి ఆర్మీ చీఫ్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కెన్యాకు అధికారిక క్షమాపణ కూడా చెప్పారు. ప్రస్తుతం ముహోజి వ్యాఖ్యలపై అటు టర్కీ.. ఇటు ఉగాండా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


