టైర్ (లెబనాన్): ఆ పాప వయసు కేవలం రెండేళ్లు మాత్రమే. యుద్ధంలోనే పుట్టింది.. యుద్ధంలోనే కన్నుమూసింది. తనచుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ పాపను యుద్ధమే బలితీసుకుంది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఆ పాప తండ్రి మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియల సమయంలో ఇజ్రాయెల్ దాడిలో ఆ రెండేళ్ల పసిపాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన దక్షిణ లెబనాన్లో చోటుచేసుకుంది. చనిపోయిన బాలిక పేరు టలీన్ సయీద్. ఇజ్రాయెల్ దాడిలో ఆ పసిపాప అక్క అలైన్ సయీద్ (7) బయటపడింది. గత వారం దక్షిణ లెబనాన్లో తన ఇంటిపై ఇజ్రాయెల్ చేసిన దాడి నుంచి కూడా అలైన్ సయీద్ ప్రాణాలతో బయటపడింది.
స్రిఫా గ్రామంలో సయీద్ ఇంటిపై బుధవారం దాడి జరిగింది. అదే రోజు అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభమైంది. ఇది తమ దేశానికి కూడా వర్తిస్తుందని లెబనాన్లో చాలామంది భావించారు. ఇజ్రాయెల్ దాడులు చేయడంతో లెబనాన్లో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సయీద్ కుటుంబానికి చెందిన మరో నలుగురు బంధువులు కూడా మృతి చెందారు.
“కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. దీంతో మేము గ్రామానికి వెళ్లాం. శవపేటిక వద్ద ప్రార్థనలు చదివి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాం. ఒక్కసారిగా ఒక తుపాను మాపై పడుతున్నట్టుగా అనిపించింది” అని నాసర్ సయీద్ (64) అనే వ్యక్తి తమపై జరిగిన బాంబు దాడుల గురించి తెలిపాడు. అతను కూడా ఈ దాడి నుంచి బయటపడ్డాడు.
ఆదివారం, అతను ఇతర బంధువులతో కలిసి దక్షిణ పోర్ట్ నగరం టైర్కు వెళ్లి పచ్చని గుడ్డలతో కప్పిన మృతదేహాలను తీసుకున్నాడు. వాటిలో ఒక మృతదేహం చాలా చిన్నగా ఉంది. అది అతని మనవరాలు టలీన్ సయీద్ మృతదేహం. అలైన్ సయీద్ చెల్లెలే టలీన్ సయీద్.
పసిపాప టలీన్ తలపై, కుడి చేతిపై బ్యాండేజ్లు, ముఖంపై గీతలు ఉన్నాయి. అది చూసిన వారికి కన్నీరు ఆగలేదు. లెబనాన్లో తాజా యుద్ధం మార్చి 2న ప్రారంభమైంది. లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా, ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ స్థావరాలపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు పెంచింది. వీటిలో 2,000 మందికి పైగా మృతి చెందారు. అందులో 165 మంది పిల్లలు, దాదాపు 250 మహిళలు ఉన్నారు.
బాంబు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్లో కాల్పుల విరమణకు ఇరాన్ పట్టుబడుతోంది. ఇరాన్-అమెరికాతో జరిపిన చర్చల్లో దీనిపై సానుకూల ప్రకటన రాలేదు. లెబనాన్ అధికారులతో వేరే మార్గంలో చర్చలు కొనసాగించాలని ఇజ్రాయెల్ చూస్తోంది.


