బ్రెయిన్ ట్యూమర్.. బహుపరాక్
World Brain Tumour Day 2026 బాపట్ల జిల్లాకు చెందిన ఎస్.శ్రీహరి ఏడాదిగా తలనొప్పి, చూపు మసకగా కనిపించం లాంటి లక్షణాలతో బాధపడుతూ పలు ఆస్పత్రులు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. చిట్టచివరకు గుంటూరులో న్యూరోసర్జరీ వైద్యులను సంప్రదించగా తలలో గడ్డ ఉందని( బ్రెయిన్ట్యూమర్) నిర్ధారించి ఆపరేషన్ చేసి తలలో ఉన్న గడ్డను తొలగించారు.
ఆధునిక జీవనశైలి వల్ల బ్రెయిన్ ట్యూమర్లు పెరిగిపోవటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లను సకాలంలో గుర్తించక పోవటంతో అవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. పెద్దవారితోపాటుగా చిన్నపిల్లల్లోనూ ట్యూమర్స్ కనిపిస్తూ ఉండటంతో ప్రతిఒక్కరు వ్యాధి పట్ల అవగాహన కల్గి ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!
బాధితులకు చికిత్స ఎలా..?
బ్రెయిన్ ట్యూమర్ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం న్యూరోసర్జరీ వైద్య నిపుణులు, న్యూరాలజిస్టులను సంప్రదిస్తున్నారు. జిల్లాలో 20 మంది న్యూరోసర్జన్లు, 25 మంది న్యూరాలజిస్టులు ఉన్నారు. వారంలో ఇరువురు లేదా ముగ్గురు బ్రెయిన్ ట్యూమర్స్ సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో న్యూరోసర్జరీ వైద్య విభాగంలో ప్రతినెలా 20 మందికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు చేస్తున్నారు. న్యూరో సర్జరీ వైద్య విభాగంలో 2023లో 2,011 మంది, 2024లో 2,603 మంది, 2025లో 8,795 మంది, 2026 జనవరి నుంచి మే వరకు 4597 చికిత్స పొందారు. న్యూరాలజీ వైద్య విభాగంలో 2023లో 16,176 మంది, 2024లో 40, 381 మంది, 2025లో 50994 మంది, 2026లో జనవరి నుంచి మే వరకు 21937 వివిధ రకాల బ్రెయిన్ సంబంధిత సమస్యలతో చికిత్స పొందారు.
లక్షణాలు...
బ్రెయిన్లో సర్వసాధారణంగా సెల్స్ చనిపోయి కొత్తవి పుట్టుకొస్తుంటాయి. కొన్ని సమయాల్లో కణాలు చనిపోకుండానే కొత్తకణాలు పుట్టుకొచ్చి కొత్తగా వచ్చిన కణాలు ట్యూమర్గా(గడ్డ) మారతాయి. కొన్ని గడ్డలు క్యాన్సర్గా మారి ప్రాణాలు తీస్తాయి. కొన్ని గడ్డలు ప్రమాదకరమైనవి కావు. ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో విపరీతమైన తలనొప్పి ఉండడం, వాంతులు అవ్వగానే తలనొప్పి తగ్గటం జరుగుతుంది. ఎక్కువగా ఉదయం వేళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. మాట్లాడటం కష్టంగా ఉంటుంది. వినికిడి సమస్య, చూపు మసకబారటం, నడవటం కష్టంగా ఉండటం తదితర లక్షణాలు ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ సైజును బట్టి, అది బ్రెయిన్లో ఏర్పడిన ప్రదేశం బట్టి, ట్యూమర్ రకాన్ని బట్టి లక్షణాలు ఒక్కో మనిషిలో ఒక్కో రకంలా కనిపిస్తాయి.
ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్
బ్రెయిన్ ట్యూమర్కు కారణాలు...
బ్రెయిన్ ట్యూమర్లు జన్యుపరలోపాల వల్ల, వంశపారంపర్యంగా వస్తాయి. బ్రెయిన్కు రేడియేషన్ సోకటం వల్ల, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వల్ల రేడియేషన్ సోకి మెదడులో గడ్డ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి.
జీజీహెచ్లో ఉచిత ఆపరేషన్లు
గుంటూరు జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్య విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాలతో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలను చేస్తున్నారు. ఆపరేషన్ చేసేందుకు నాలుగు గంటల నుంచి ఎనిమిదిగంటల వరకు సమయం పడుతుంది. సుమారు రూ.3లక్షల ఖరీదు చేసే ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేస్తున్నారు.
ఆధునిక సర్జరీలతో మెరుగైన జీవితం...
బ్రెయిన్ సర్జరీలు గతంలో ఆరు గంటలకు పైగా సమయం పడితే ఆధునిక టెక్నాలజీ వల్ల నేడు కేవలం అరగంటలోనే పూర్తి చేస్తున్నాం. ఒకరోజు పట్టే ఆపరేషన్లు సైతం గంటలోనే పూర్తి చేస్తున్నాం. ఎండోస్కోపిక్ సర్జరీలు, కీహోల్ సర్జరీలు, నేవిగేషన్ గైడెడ్, మైక్రోస్కోపిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. న్యూరోసర్జరీలో వచ్చిన ఆధునిక వైద్య పద్ధతులతో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయించుకున్న వారు గతంలో కంటే చాలా మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. ఆధునిక వైద్యం ద్వారా నూటికి 95శాతం రోగికి మంచి జీవితాన్ని ప్రసాదించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్లో నూటికి 10శాతం మాత్రమే ప్రాణాంతకమైనవి. – డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, న్యూరోసర్జన్
ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు...
బ్రెయిన్ ట్యూమర్లను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ప్రాథమిక దశలోనే తలలో గడ్డలను గుర్తిస్తే ఆపరేషన్లతో పనిలేకుండా మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. అన్ని ట్యూమర్లకు ఆపరేషన్లు చేయాల్సిన పనిలేదు. జనాభాలో ఒకశాతం మంది బ్రెయిన్ ట్యూమర్లతో బాధపడుతున్నారు. ప్రజలకు బ్రెయిన్ ట్యూమర్స్పై అపోహలు చాలా ఉన్నాయి. అవగాహన చాలా తక్కువగా ఉంది.
– డాక్టర్ పమిడిముక్కల విజయ, న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు
ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు


