ఉత్తర ప్రదేశ్లో మరో ఊహించని పరిణామం గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. పెళ్లికి ముందు రాత్రే వధువు తన ప్రియుడితో పారిపోయింది. ఎలాగో ఒప్పించి, వధువు చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ పెళ్లి కొడుకును వెక్కిరించింది. ఇక ఈ తరువాతి పరిణామాలు ఒక్కోటి సినిమా రేంజ్లో చక చకా జరిగిపోయాయి. చివరికి ఈ వివాదం మరింత ఉద్రిక్తమై కాల్పుల దాకా చేరింది.
ఉత్తరప్రదేశ్లోని బిత్థ్రి ప్రాంతంలోని షాజహాన్పూర్-బరేలీ రోడ్డుపై ఉన్న ఒక బ్యాంకెట్ హాల్లో శనివారం పెళ్లి వేడుక ఉత్సాహంగా జరుగుతోంది. వధూవరులిద్దరూ అందంగా ముస్తాబయ్యారు. అతిథులందరూ ఎవరి హడావిడిలో వారు తిరుగుతూ, విందు భోజనానికి సిద్దపడుతున్నారు. పెళ్లి కొడుకు తన బృందంతో (ఊరేగింపుగా), అటు వధువు కుటుంబ సభ్యులు కూడా సందడి ఉన్నారు. ఇంతలో కలకలం రేపింది. హాజరైన అతిథులకు భోజనాలకు బదులు దాడులు మొదలయ్యాయి. ఈ గందరగోళం మధ్య కాల్పులుకు దారి తీసింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ట్విస్టుల మీద ట్విస్టులు
సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి వధువు రాలేదు. పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగలతో సహా వధువు రాత్రికి రాత్రే ప్రియుడితో ఉడాయించింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆమె చెల్లెల్ని వధువు స్థానంలోకూర్చోబెట్టడానికి ఒప్పించి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తంతు ముగిద్దాం అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు మారిపోయిందన్న విషయాన్ని గమనించిన పెళ్లి కొడుకు ‘నాకీ పెళ్లి వద్దు పొమ్మన్నా’డు.
ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్
అయితే ఎలాగోలా పెద్దలంతా సంప్రదింపులు జరిపే వరుడిని పెళ్లికి ఒప్పించాడు. ఇక్కడ మళ్లీ ట్విస్ట్. ఈ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగి, అంతా చక్కబడింది అనుకునే లోపే, వధువు చెల్లెలి ప్రియుడుఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ లొల్లి షురూ. చినికి చినికి గాలివానలా మొదలైన ఈ వ్యవహారం భౌతిక ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో పలువురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకున్నట్టు గానీ, ఎవరిపైనా కేసులు నమోదు చేసినట్టు గానీ సమాచారం లేదు.
ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు


