న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతూ, విపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమి విచ్ఛిన్నానికి గల అసలు కారణాలను జనతాదళ్ (యునైటెడ్) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా బహిర్గతం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరే ఈ కూటమిని సర్వనాశనం చేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన సంజయ్ ఝా, ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూటమి అంతర్గత సమావేశాల్లో జరిగిన రాజకీయ కుట్రలను బట్టబయలు చేశారు.
‘ఆ ఇద్దరే కూటమిని ముంచేశారు’
బీజేపీని ఎదుర్కొనేందుకు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఏర్పడిన ఇండియా కూటమిలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయని సంజయ్ ఝా అన్నారు. ‘ఇండియా కూటమిని ఇద్దరు వ్యక్తులు నాశనం చేశారు, నేను రికార్డు పరంగా చెబుతున్నాను: వారి పేర్లు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్’ అని ఆయన ఆరోపించారు. కూటమిలో ఎటువంటి స్పష్టమైన ప్రణాళిక, దార్శనికత లేదా ఐక్యత లేవని, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న తరుణంలో ఈ ఇద్దరు నాయకులు స్వార్థ రాజకీయాలతో కూటమిని దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు.
‘పక్కా ప్లాన్తోనే విధ్వంసం’
2023 జూన్లో పట్నాలో జరిగిన ఇండియా కూటమి మొదటి కీలక సమావేశంలో నితీష్ కుమార్ను కూటమి కన్వీనర్గా నియమించేందుకు విస్తృతమైన అంగీకారం కుదిరిందని ఝా వెల్లడించారు. అయితే, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ముందస్తు వ్యూహంతోనే ఆ ప్రతిపాదనను అడ్డుకున్నారని తెలిపారు. దళిత నేతను కన్వీనర్గా చేయాలనే డిమాండ్ను తెరపైకి తెస్తూ మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారని, దీనితో కాంగ్రెస్ వెనకడుగు వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నితీష్ కుమార్ కన్వీనర్ పదవి కోసం ఎప్పుడూ ఆశపడలేదని, అందరినీ ఒకే వేదికపైకి తేవడమే ఆయన లక్ష్యమని, కానీ ఆ ప్రయత్నాన్ని వారు పక్కా ప్లాన్తో దెబ్బకొట్టారని ఆరోపించారు.
మారిన రాజకీయ సమీకరణలు
ఈ పరిణామాల తర్వాతే నితీష్ కుమార్ 2024 జనవరిలో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే లోకి తిరిగి వెళ్లారని సంజయ్ ఝా గుర్తుచేశారు. ఇటీవల బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కాగా, తాజాగా ఢిల్లీలో విపక్షాల వ్యూహాల పునఃసమీక్ష కోసం 23 రాజకీయ పార్టీల కీలక సమావేశం జరగనున్న తరుణంలో సంజయ్ ఝా చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.
ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మరో షాక్: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా


